దేవీం ప్రణమామ్యహమ్ (ఋషిపీఠం విశిష్టసంచిక) 2004




హిందూ సంప్రదాయములో శ్రీదేవీ నవరాత్రులకు విశిష్ట ప్రాధాన్యం ఉన్నది. మన భారతదేశంలో ఈ దేవీ పూజలు వేదకాలం నుంచే ఉన్నాయనడానికి ఋగ్వేదంలోని దేవీసూక్త, రాత్రిసూక్తాదులే నిదర్శనం. బ్రాహ్మణములు, అరణ్యకములు, ఉపనిషత్తులలో కూడా దేవీ ప్రస్తావన విరివిగా ఉన్నది. మహాభారతంలో దుర్గాదేవి స్తుతి ఉన్నది. స్కాంద, మత్స్య, వామన, వరాహాది పురాణాలలో దేవీవృత్తాంతం కనిపిస్తున్నది. దేవీ భాగవతం శ్రీదేవీ ప్రాశస్త్యాన్ని వేనోళ్ళ కొనియాడుతున్నది.

దేవీ నవరాత్రులు రెండు రకాలుగా జరుగుతాయి. చైతశుద్ధ విదియ మొదలు నవమి వరకూ చేసే నవరాత్రులను వసంత నవరాత్రులని, ఆశ్వయుజ శుద్ధ విదియ మొదలు నవమి వరకూ చేసే నవరాత్రులను శరన్నవరాత్రులని పిలుస్తారు. ఈ రెండింటిలోను శరన్నవరాత్రులకే దేవీనవరాత్రులని ప్రసిద్ధి.

ఈ శరన్నవరాత్రులలో దేవీపూజలను తొమ్మిది రోజులు చెయ్యడానికి కారణం భవిష్యపురాణం, దేవీపురాణము, మార్కండేయ పురాణములలో చెప్పబడింది. దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేయడానికి ఆదిశక్తి అయిన జగన్మాత తొమ్మిది అవతారాలను ధరించింది. అవి మహాకాళి, మహిషాసురమర్దిని, చాముండ, నంద, రక్తదంతి, శాకంభరి, దుర్గ, మాతంగిని, భ్రామరి అనేవి. ఈవిధంగా ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారంగా భావించి ఈ తొమ్మిది రోజులూ పూజించుట నవరాత్రి సంప్రదాయం అయింది.

ఈశక్తి పూజా విధానములు తాంత్రిక గ్రంథాలలో వివరింపబడినాయి. తంత్రమంటే జ్ఞానమును విస్తరింపజేయునది అని అర్థము. అనగా మంత్రముల తత్త్వమును, వాటి అర్థమును, ఉపాసనా విధానమును వివరించేది అని అర్థం. ఆ తాంత్రిక గ్రంథాలలో శక్తులకు చిహ్నాలుగా యంత్రములనే రేఖాచిత్రాలను ఉపయోగిస్తారు.

దేవీ ఉపాసన విగ్రహరూపంలో కానీ, యంత్రరూపంలో కానీ జరపటం సంప్రదాయం. ఈ రెండింటిలోను, యంత్ర రూపోపాసన శ్రేష్ఠతమమైనదని ఆగమాదులు చెబుతున్నాయి. ఆ మంత్రాలన్నింటిలోను సర్వోత్కృష్టమైనది శ్రీచక్రము. అందుకే దానికి యంత్రరాజమని ప్రసిద్ధి.

శ్రీచక్రములో తొమ్మిది ఆవరణలున్నవి. త్రిపురతాపినీ ఉపనిషత్తులో ఆ నవావరణముల వివరణ ఇలా ఉన్నది

బిందుత్రికోణ సమకోణ దశారయుగ్మ మన్వస్ర నాగదళ షోడశపత్రయుక్తం! వృత్తత్రయం చ ధరణీసదన త్రయం చ! శ్రీచక్రరాజ ఉదితః ప్రదేవతాయాః!!

బిందువు, త్రికోణము, అష్టకోణ చక్రము, అంతర్దశారము, బహిర్దశారము, చతుర్దశారము, అష్టదళపద్మము, షోడశదళపద్మము, భూపురముఅనే తొమ్మిది ఆవరణములు శ్రీచక్రములో అవరోహణ క్రమమున ఉన్నాయి.

ఈ తొమ్మిది ఆవరణములకు నవచక్రములని ప్రసిద్ధి.

. భూపురముత్రైలోక్యమోహన చక్రము ౨. షోడశదళ పద్మముసర్వాశాపరిపూరక చక్రము ౩. అష్టదళ పద్మముసర్వసంక్షోభణ చక్రము ౪. చతుర్దశారముసర్వసౌభాగ్యదాయక చక్రము ౫. బహిర్దశారముసర్వార్థసాధక చక్రము ౬. అంతర్దశారముసర్వరక్షాకర చక్రము ౭. అష్టకోణముసర్వరోగహర చక్రము ౮. త్రికోణముసర్వసిద్ధిప్రదచక్రము ౯. బిందువుసర్వానందమయ చక్రము.

ఈ తొమ్మిది చక్రములలో ప్రతి ఒక్క చక్రమునకు ఒక చక్రస్వామిని, కొంతమంది పరివార దేవతలు ఉన్నారు. ఆ వివరముఉ శ్రీదేవీ ఖడ్గమాలలో వివరింపబడినాయి. ఏఏ చక్రములకు ఎవరెవరు అధిష్ఠాన దేవతలోతెలిసికొని పూజిస్తే సత్ఫలితాలు సత్వరంగా లభిస్తాయి.

కర్ణాటక సంగీత రత్న త్రయములో ఒక్కడైన శ్రీ ముత్తుస్వామి దీక్షితులు శ్రీ విద్యా రహస్యవేత్త, పూర్ణ దీక్షాపరులు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని సాక్షాత్కారమును పొందిన భాగ్యశాలి. ఆయన శ్రీ చక్రములోని తొమ్మిది ఆవరణలను గురించి, తొమ్మిది కీర్తనలు వ్రాసినారు. వారితి "శ్రీపుర కమలాంబికా నవావరణ కీర్తన"లని ప్రసిద్ధి. శ్రీపురమంటే శ్రీచక్రమే. అదీకాక - ముత్తుస్వామి దీక్షితుల జన్మ స్థలము తిరువారూరు. దానిని సంస్కృతీకరిస్తే 'శ్రీపురము' అవుతుంది. ఆ గ్రామమున వేంచేసియున్న అమ్మవారు కమలాంబిక. ఆమెయే శ్రీ లలితా త్రిపుర సుందరి. ఆ కమలాంబికను గురించి దీక్షితుల వారు వ్రాసిన నవావరణ కీర్తనలు సంగీత ప్రపంచమున జగత్ప్రసిద్ధములు. ఆ కీర్తనలలో ముత్తుస్వామి దీక్షితుల ప్రతిభ పతాకస్థాయినందు కొన్నది. ఆ కీర్తనలలో శ్రీచక్ర స్వరూప వర్ణనమే కాక, యంత్ర-మంత్రం-తంత్ర భావములు కూర్చబడినవి. ఆ కీర్తనలు మొత్తం పదకొండు.

కమలాంబికే ఆశ్రిత కల్ప లతికే చణ్డికే - ధ్యానకీర్తన

ప: కమలాంబికే ఆశ్రిత కల్ప లతికే చణ్డికే

కమనీయారుణాంశుకే కర విధృత శుకే మామవ

అ.ప: కమలాసనాది పూజిత కమల పదే బహు వరదే 

కమలాలయ తీర్థ వైభవే శివే కరుణార్ణవే 

౧. సకల లోక నాయికే సంగీత రసికే 

సుకవిత్వప్రదాయికే సుందరి గత మాయికే 

వికళేబర ముక్తి దాన నిపుణే అఘ హరణే 

వియదాది భూత కిరణే వినోద చరణే అరుణే 

సకలే గురుగుహరణే సదాశివాంత:కరణే   

అకచట తపాదివరణే అఖండైకరసపూర్ణే!!

అందులో మొదటిది - "కమలాంబికే ఆశ్రిత కల్పలతికే చండికే" అన్న మొదటిది ధ్యాన కీర్తన. తోడి రాగము - రూపక తాళములో నున్నది.
శ్రీ కమలాంబికా! ఆశ్రిత భక్తులకు కల్పవృక్షమా! చండికా! కమనీయ అరుణాంశుకధారిణీ! లీలాశుకహస్తా! బ్రహ్మాది పూజిత పాదపద్మా! వరదా! కమలాలయ తీర్థ వైభవా! శివా! కరుణా సముద్రా! సకలలోక నాయకీ! సంగీత రసికా! సుకవిత్వప్రదాయినీ! సుందరీ! గతమాయా! ముక్తిదాన నిపుణా! పాపహారిణీ! ఆకాశాది పంచభూత రంజిత చరణా! అరుణా! గురుగుహ కరుణా! సదాశివాంతఃకరణా! మాతృకా వర్ణ రూపిణీ! అఖండైకరససంపూర్ణా! జగడంబికే! నన్ను రక్షింపుము. - అని ఈ కీర్తన అర్థం.
ఈ కీర్తనలో ముత్తుస్వామి దీక్షితులు - జగన్మాత సాకార రూపమును, ఆమె దాక్షిణ్యాది లక్షణాలను ఘనంగా ప్రస్తుతించారు. మనోహరమైన ఎర్రని అంశుకమును ధరించి, చేతిలో లీలా శుకమును ధరించి, బ్రహ్మాది దేవతలచేత కూడా పూజింప బడే పాదపద్మములు కలది ఆ జగన్మాత. ఇది ఆమె సాకార స్వరూపము. తనను ఆశ్రయించిన భక్తకోటికి కల్పవృక్షము, కరుణార్ణవత్వము, సకల లోకాధిపత్యము, సంగీత రసికత్వము, సుకవిత్వ ప్రదాయిత్వము, మాయాతీత లక్షణము, పంచాశద్వర్ణ మాతృకా స్వరూపము., సదాశివ అంతఃకరణ తత్త్వము అనేవి ఆ తల్లి కరుణా లక్షణములు! ఇందులోని విశేషణములన్నీ ప్రథమావిభక్తిలో ఉన్నాయి.
సకుంకుమ విలేపనా మళిక చుంబి కస్తూరికాం|
సమందహసితేక్షణాం సశరచాప పాశాంకుశాం |
అశేషజమోహినీమరుణమాల్యభూషాంబరాం |
జపాకుసుమ భాసురాం జపనిధౌ స్మరేదంబికాం ||
ఎర్రని పూలమాలలు, ఎర్రని రత్నహారములు, ఎర్రని వస్త్రములు ధరించి, జపాకుసుమ కాంతితో విరాజిల్లుతూ, అశేష జనులను మొహిమ్పజేసే ఆ దివ్య స్వరూపిణి పూజా సమయంలో స్మరిస్తూ భజించటం సంప్రదాయం!
కాలిదాస మహాకవి కూడా - "జయసంగీత రసికే, జయ లీలాశుకప్రియే" అని ఆ జగన్మాత స్వరూపాన్ని కీర్తించాడు.
శ్రీ శంకర భగవత్పాదులు తమ సౌందర్యలహరిలో - "అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి" అని హరిహర హిరణ్యగర్భులందరి చేతనూ పూజింపబడే ఆ శక్తి స్వరూపిణిని అభివర్ణించారు.
ఈవిధంగా ఆమె సాకార స్వరూపాన్ని ప్రత్యక్షీకరింపజేసి, భక్తుల హృదయాలలో పదిలపరచటానికి మహాకవివతంసులు చేసిన ప్రయత్నాన్నే దీక్షితుల వారు కూడా తమ ధ్యానకీర్తనలో చేసినట్లు స్పష్టమవుతుంది.
ఇక ఈ కీర్తనలోని మిగిలిన విశేషణములు ఆ జగన్మాత నిరాకర స్వరూప వర్ణములు. అమ్మవారి స్వరూప స్వభావాలను అభివర్ణిస్తూ చేసిన శ్రీ లలితా సహస్ర నామావళి లోని భక్తిమత్కల్పలతికా, కరుణామృత సాగరా, కావ్యకళా, కైవల్యపదదాయినీ, సర్వారుణా, మాయాతీతా, వర్ణ రూపిణీ - అన్న నామములే ఈ కీర్తనలో చక్కగా పొదగబడినాయి.
కీర్తన చివర - 'అకచటతపాదివర్గే' అని సంబోధించారు. వర్ణమాలలో అకచటతపయశ అనునవి ఆయా వర్గముల ఆద్యక్షరములు. అందువలన పంచాశద్వర్ణములు ధ్వనితమై 'వర్ణరూపిణీ' అన్న నామమును సార్థకము చేస్తున్నది.
ఈవిధంగా దీక్షితుల వారు ఈ ధ్యాన కీర్తనలో అమ్మవారి బహిరంతస్స్వరూపాన్ని కళ్ళకు కట్టినట్లు అభివర్ణించారు.

ఆ తరువాత తొమ్మిది కీర్తనలలో శ్రీదేవికి ప్రతీకయైన శ్రీచక్రములోని నవావరణములను, వాటిలోని ఆవరణ దేవతలను, ఇతర విశేషములను వర్ణించారు.

కమలాంబా సంరక్షతు మామ్ - ప్రథమావరణ కీర్తనమ్

ప: కమలాంబా సంరక్షతు మాం
హృత్కమలానగర నివాసినీ అంబ

అ.ప: సుమనసారాధితాబ్జ ముఖీ
సుందర మనఃప్రియకర సఖీ
కమలజానంద బోధ సుఖీ
కాంతా తార పంజర శుకీ

1. త్రిపురాది చక్రేశ్వరీ అణిమాది సిద్ధీశ్వరీ
నిత్య కామేశ్వరీ
క్షితి పుర త్రై-లోక్య మోహన చక్రవర్తినీ
ప్రకట యోగినీ
సుర రిపు మహిషాసురాది మర్దినీ
నిగమ పురాణాది సంవేదినీ
(
మధ్యమ కాల సాహిత్యమ్)
త్రిపురేశీ గురు గుహ జననీ
త్రిపుర భంజన రంజనీ
మధు రిపు సహోదరీ తలోదరీ
త్రిపుర సుందరీ మహేశ్వరీ!!

నవావరణ కీర్తనలలో ప్రథమావరణ కీర్తన కమలాంబా సంరక్షతుమాంఅన్నది ఆనందభైరవీ రాగము త్రిపుట తాళంలో కూర్చబడినది.

నా హృదయమందు నివసించునట్టి కమలాంబా! దేవతారాధితా! శివప్రియసఖీ! బ్రహ్మానంద బోధ సుఖీ! ఓంకార పంజరశుకీ! త్రిపురాది చక్రేశ్వరీ! అణిమాది సిద్దేశ్వరీ! నిత్యకామేశ్వరీ! త్రైలోక్యమోహన చక్రవర్తినీ! ప్రకట యోగినీ! మహిషాసుర మర్దినీ! నిగమ పురాణవేదినీ! త్రిపురేశీ! గురుగుహ జననీ! త్రిపురభంజన శివరంజనీ! నారాయణ సహోదరీ! తలోదరీ! త్రిపురసుందరీ! మహేశ్వరీ! నన్ను రక్షింపుము అని ఈ కీర్తన అర్థము.

ఈ కీర్తనలో శ్రీచక్రములోని ప్రథమావరణమైన త్రైలోక్య మోహన చక్రము. అందులోని ఆవరణ దేవతలు, అచటి యోగినులు, చక్రస్వామిని వర్ణింపబడినారు. త్రిపురాది చక్రేశ్వరి, అణిమాది సిద్దేశ్వరి, నిత్య కామేశ్వరి, ప్రకటయోగిని అయిన త్రిపుర సుందరి వర్ణింప బడినది.

త్రైలోక్య మోహన చక్రమునకే భూపురమని నామాంతరము. ఇందులో మూడు వలయములున్నాయి. మొదటి వలయంలో అణిమ లఘిమ మహిమ ఈశత్వ వశిత్వ ప్రాకామ్య భుక్తి ఇచ్ఛా ప్రాప్తి సర్వకామసిద్ధి అనే పది సిద్ధులు ఆవరణ దేవతా మూర్తులై ఉన్నారు.

రెండవ వలయంలో బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండ మహాలక్ష్మి అనే అష్ట మాతృకలున్నాయి.

మూడవ వలయంలో సర్వ సంక్షోభిణి సర్వాకర్షిణి సర్వ విద్రావిణి సర్వ వశంకరి సర్వోన్మాదిని సర్వ మహాంకుశ సర్వ ఖేచరి సర్వ బీజ సర్వ యోని సర్వత్రిఖండ అన్న పదిమంది ముద్రా దేవతలున్నారు.

ఈ త్రైలోక్య మోహన చక్రస్వామిని త్రిపురాదేవి. అందుకే దీక్షితుల వారు త్రిపురాది చక్రేశ్వారిఅని సంబోధించారు.

ఈ చక్రములోని యోగిని ప్రకటయోగిని. అందుకే, ‘త్రైలోక్య మోహన చక్రవర్తినీ, ప్రకటయోగినీఅని సంబోధించారు.

ఈ కీర్తనలోని సంబోధనలన్నీ ప్రథమావిభక్తిలో ఉన్నాయి.

ఇట్లా ఈ రెండవ కీర్తనలో భూపురమును, అందులోని ఆవరణ దేవతలను అభివర్ణించారు దీక్షితుల వారు.

దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసం అవతరించిన ఆ జగన్మాత మధుకైటభులు మహిషాసురుడు దూమ్రలోచనుడు చండముండాసురులు రక్తబీజుడు శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించినది.

ఈ కీర్తనలో మహిషాసుర మర్దన కథ ప్రసక్తమయినది.

కశ్యప ప్రజాపతికి దితివలన జన్మించిన వారు రాక్షసులు. దేవతాధిపతి అయిన ఇంద్రుడు వాళ్ళందరినీ సంహరించడం సహించలేని దితి, ఇంద్రుని జయించగల పుత్రుని పొందవలెననే సంకల్పంతో సుపార్శ్వుడనే ముని ఆశ్రమం ప్రక్కన తపస్సు ప్రాంభించింది. ఆమె తపస్సు వేడికి తట్టుకోలేని సుపార్శ్వుడు – “నీకు మహిషుడు పుట్టుగాకఅని శపించాడు. కానీ ఆమె తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రక్యక్షమై నీ కుమారుని ముఖము మాత్రము మహిష ముఖముగా ఉంటుంది. మిగిలిన శరీరము మాత్రము మానవ దేహం వలెనే ఉంటుందిఅని అనుగ్రహించాడు.

ఆవిధంగా జన్మించిన మహిషాసురుడు శివుని గూర్చి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షము కాగా, తనకు మరణము లేకుండా వారము నిమ్మని కోరాడు. పుట్టిన వారికి మరణము తప్పదని చెప్పి, వేరొక వారము కోరుకొమ్మన్నాడు శివుడు. మహిషుడు తనకు స్త్రీవలన మాత్రమె మరణము కలుగునట్లు వరము కోరుకొన్నాడు.

ఈశ్వర వర ప్రసాదముచే మదించిన మహిషుడు దేవతలను ఎక్కువగా బాధించసాగాడు. అతని క్రూరత్వమును సహించలేక దేవతలు, తమ తేజములనన్నింటినీ ఒక్కటిగా చేర్చి స్తుతించారు. అందులోనుంచి జగన్మాత ఆవిర్భవించింది. ఆమెకు దేవతలంతా తమ ఆయుధాలనిచ్చారు. ఆ దేవి సింహవాహనమధిష్టించి, మహిషాసురుని సంహరించింది.

ఆవిధంగా మహిషాసురుని మర్దించిన అమ్మవారిని శ్రీ శంకర భగవత్పాదులు తమ మహిషాసుర మర్దినీ స్తోత్రంలో ఈవిధంగా కీర్తించారు.

అయిగిరి నందిని నందితమోదిని విశ్వవినోదిని నందినుతే  
గిరివర వింధ్య శిరోధి నివాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే  
భగవతి హే శితికంఠ కుటుంబిని భూరికుటుంబిని భూరికృతే 
జయజయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే!!

కమలాంబాం భజరే రే మానస - ద్వితీయావరణ కీర్తన

ప: కమలాంబాం భజరే రే మానస
కల్పిత మాయా కార్యం త్యజ రే

అ. ప: కమలా వాణీ సేవిత పార్శ్వాం
కంబు జయ గ్రీవాం నత దేవాం
కమలా పుర సదనాం మృదు గదనాం
కమనీయ రదనాం కమల వదనామ్

౧. సర్వ-ఆశా-పరిపూరక-చక్ర స్వామినీం
పరమ-శివ కామినీం
దుర్వాస-అర్చిత గుప్త-యోగినీం
దుఃఖ ధ్వంసినీం హంసినీమ్
నిర్వాణ నిజ సుఖ ప్రదాయినీం
నిత్య కల్యాణీం కాత్యాయనీం
శర్వాణీం మధుప విజయ వేణీం
సద్-గురు గుహ జననీం నిరంజనీమ్
గర్విత భండ-అసుర భంజనీం
కామాకర్షిణి-ఆది రంజనీం
నిర్విశేష చైతన్య రూపిణీం
ఉర్వీ తత్వ-ఆది స్వరూపిణీం

౨. ముత్తుస్వామి దీక్షితుల వారి నవావరణ కీర్తనలలోని ద్వితీయావరణ కీర్తన "కమలాంబాం భజరే మానస"అన్నది. కళ్యాణీ రాగము, ఆదితాళంలో కూర్చబడినది.

" మనసా! ఈ లౌకిక మాయాకార్యములను త్యజించి శ్రీదేవిని భజింపుము. లక్ష్మీవాణీ సేవిత అయిన దానిని, కంబుజయగ్రీవ అయిన దానిని, దేవతల చేత నమస్కరింప బడినదానిని, మృదువైన వాక్కులు కలదానిని, కమలనేత్రను, సర్వాశాపరిపూరక చక్రస్వామినిని, శివకామినిని, దూర్వాసార్చిత గుప్త యోగినిని, దుఃఖధ్వంసినిని, నిర్వికార స్వరూపిణిని, భండాసురభంజనిని, కామాకర్షిణ్యాది దేవతా రంజనిని, చైతన్యస్వరూపిణిని, ఉర్వితత్త్వాది స్వరూపిణిని, - ఓ మనసా౧ భజింపుము - అని ఈ కీర్తన అర్థము.
కీర్తనలో శ్రీచక్రములోని రెండవ ఆవరణమైన షోడశదళ పద్మము - అందులోని ఆవరణ దేవతలు, అచటి యోగిని, చక్రస్వామినులు వర్ణింపబడినారు. ఈ ఆవరణమునకు సర్వాశాపరిపూరక చక్రమని పేరు.
ఈ ఆవరణములోని 16పద్మ దళములను 16 మంది ఆవరణ దేవతలు అధివసించి ఉన్నారు. వారు - కామాకర్షిణి - బుద్ధ్యాకర్షిణి - అహంకారాకర్షిణి - శబ్డాకర్షిణి - స్పర్శాకర్షిణి - రూపాకర్షిణి - రసాకర్షిణి - గంధాకర్షిణి - చిత్తాకర్షిణి - ధైర్యాకర్షిణి - స్మృత్యాకర్షిణి - నామాకర్షిణి - బీజాకర్షిణి - ఆత్మాకర్షిణి - అమృతాకర్షిణి - శరీరాకర్షిణి - అనేవారు. అందుకే ఈ కీర్తనలో 'కామాకర్షిణ్యాదిరంజనీం' అని సంబోధించారు దీక్షితుల వారు.
దీనికి సర్వాశాపరిపూరక చక్రమని పేరు కనుక 'సర్వాశాపరిపూరక చక్రస్వామినీం' అని సంబోధించారు.
చక్రస్వామిని త్రిపురేశి - ఆమెయే పరమ శివకామిని. ఇచ్చటి యోగిని గుప్తయోగిని. ఆ విషయాన్నే దీక్షితుల వారు 'దూర్వాసార్చిత గుప్తయోగినీం, దుఃఖధ్వంసినీం, హంసినీం' అని వర్ణించారు. దూర్వాసుడు 12మంది శ్రీవిద్యాచక్రవర్తులలో ఒకడు. ఆయన మంత్రద్రష్ట కూడా. 
కీర్తనలోని అనుపల్లవిలో 'కమలా వాణీ సేవిత పార్శ్వాంఅన్నది లలితా సహస్ర నామావళిలోని సచామరరమావాణీ సవ్యదక్షిణ సేవితాఅన్న నామ తాత్పర్యమే.
చరణములలోని -నిర్వాణ సుఖదాయినీ, నిత్యా, కళ్యాణీ, కాత్యాయినీ, శర్వాణీ - అన్నవి సహస్రనామావళిలోని సంబోధనలే.
ఆవరణములోని అమ్మవారి సంబోధనలన్నీ ద్వితీయావిభక్తిలో ఉన్నాయి.  ఉన్నాయి.  "గర్విత భండాసుర భంజనీం" అని కీర్తన చరణములలో శ్రీదేవి వర్ణింపబడింది. ఈ భండాసురుని వృత్తాంతము లలితోపాఖ్యానములో సవిస్తరముగా ఉన్నది.

ఈశ్వరుని కంటిమంటలకు మన్మథుడు భస్మమైనాడు. చిత్రకర్మ నిపుణుడైన విఘ్నేశ్వరుడు ఆ బూడిదను బాలునిలాగా చేయగా, ఈశ్వరుని వీక్షణమున అతనికి ప్రాణములు వచ్చినాయి. విఘ్నేశ్వరుడా బాలునికి శతరుద్రీయము నుపదేశించి, ఈశ్వరును అనుగ్రహము సంపాదించుకొమ్మన్నాడు. ఆవిధంగా బాలుడు ఈశ్వరుని గురించి తపస్సు చేసి, ఆయన అనుగ్రహమును పొందాడు. ఆ బాలుని భక్తి ప్రపత్తులను చూసి బ్రహ్మదేవుడుభండ!భండఅన్నాడట. అంటేబాగు, బాగుఅని అర్థం. అందువలన అతనికి భండుడని పేరు వచ్చింది. రుద్రకోపాగ్ని వల పుట్టిన భండుడు రౌద్రస్వభావము కలవాడై రాక్షసప్రవృత్తితో సంచరించసాగినాడు.

భండాసురుని దక్షిణ పార్శ్వమునుండి విశుక్రుడు, వామపార్శ్వము నుండి విషంగుడు పుట్టారు. అతని తపోబలమున లక్షణాది రాక్షసులు జన్మించారు. వారంతా దేవతలను బాధింపసాగారు. వారి ధాటికి తట్టుకొనలేక, దేవతలు నీరసపడినారు. దేవతలు మహాదేవుని ఆశ్రయించి ప్రార్థించారు. ఈశ్వరుని ఆజ్ఞానుసారము వారొక మహాయాగమును చేయనారంభించారు. ఆ అగ్నికుండములోనుండి దేవకార్యసాధనకొరకు పరమేశ్వరి ఉద్భవించినది. లలితా సహస్రనామావళిలోనిచిదగ్నికుండసంభూతా దేవకార్యసముద్యతా’, ‘మహాయాగక్రమారాధ్యాఅన్న నామములచే ఇది సూచింపబడినది.

ఆ తరువాత ఆమె తొమ్మిది పర్వములతో కూడిన చక్రరాజ రథమును అధివసించినది. ఆమెకు దశసిద్ధులు, అష్టమాతృకలు, ముద్రాదేవతలు, గుప్తయోగినులు, నిగర్భయోగినులు, రహస్య యోగినులు, అతిరహస్య శక్తులు, సహాయభూతులై రాగా విషంగవిశుక్రులను, వారి సైన్యాన్ని సంహరించింది. సహస్ర నామావళిలోనిమంత్రిణ్యంబావిరచిత విషంగవధతోషితా, విశుక్రప్రాణహరణవారాహీ వీర్యనందితాఅన్న నామములలో ఈ విషయము అభివర్ణింపబడినది.

ఆ తరువాత భండాసురుని ససైన్యముగా సంహరించి బ్రహ్మాది దేవతల స్తుతికి పాత్రమైనది.

భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితా! భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా! భండాసురేంద్ర నిర్ముక్త శస్త్రప్రత్యస్త్రవర్షిణీ! కామేశ్వరాస్త్ర నిర్ధగ్ధ సభండాసురశూన్యకా! బ్రహ్మోపేంద్రమహేంద్రాదిదేవసంస్తుత వైభవా!!

అన్న నామాలలో ఈ విషయము ప్రస్తావింపబడినది.

3.  శ్రీ కమలాంబికయా రక్షితోహం - తృతీయావరణ కీర్తన

దీక్షితుల వారి నవావరణ కీర్తనలలోని తృతీయావరణ కీర్తనశ్రీ కమలాంబికయా రక్షితోహంఅన్నది. శంకరాభరణ రాగమే. రూపక తాళములో కూర్చబడినది.

ఇంద్రాది సకల దేవతలచే సేవింపబడిన శ్రీదేవిచేతను, బ్రహ్మాది దేవతలచే సంభావింపబడిన తల్లి చేతను, కుమారస్వామిని అనుగ్రహించిన మాత చేతను, అనంగ కుసుమాది అష్టశక్తుల ఆకారము కలదాని చేతను, అరుణవర్ణము గల సర్వసంక్షోభణ చక్రాకారము కలదాని చేతను, అనంతకోటి బ్రహ్మాండనాయకుని దేవి చేతను, అష్టవర్గాత్మకమైన శ్రీమాతచేతను, అష్టదళపద్మమునందున్న అనంగ కుసుమాది దేవతలచేత ఆరాధింపబడిన దేవి చేతను, ధనుర్బాణధారిచేతను, దయామృతసాగరియగు తల్లి చేతను నేను కటాక్షింపబడినాను అని ఈ కీర్తన అర్థము.

తృతీయావరణమునకు సంబంధించిన ఈ కీర్తనలోని సంబోధనలన్నీ తృతీయా విభక్తిలో ఉన్నాయి.

శ్రీ చక్రములోని మూడవ ఆవరణము అష్టదళ పద్మము. దీనికి సర్వ సంక్షోభణ చక్రము అని పేరు. ఇక్కడ ఎనిమిది మంది దేవతలున్నారు. వారు అనంగకుసుమ, అనంగమేఖల, అనంగమదన, అనంగమదనాతుర, అనంగరేఖ, అనంగవేగిని, అనంగాంకుశ, అనంగమాలిని అన్నవారు. ఈ విషయమేఅనంగకుసుమాద్యష్టశక్త్యాకారఅన్న చరణములో చెప్పబడినది.

ఈ చక్రములోని యోగినులు గుప్తతర యోగినులు. చక్రస్వామిని త్రిపురసుందరి.

పల్లవిశ్రీ కమలాంబికయా కటాక్షితోహం
సచ్చిదానంద పరిపూర్ణ బ్రహ్మాస్మి

అనుపల్లవిపాక శాసనాది సకల దేవతా సేవితయా
పంకజాసనాది పంచ- కృత్యాకృత్భావితయా
(
మధ్యమ కాల సాహిత్యం)
శోక హర చతుర పదయా
మూక ముఖ్య వాక్ప్రదయా
కోకనద విజయ పదయా
గురు గుహ తత్-త్రై-పదయా

చరణఅనంగ కుసుమాద్యష్ట శక్త్యాకారయా
అరుణ వర్ణ సంక్షోభణ చక్రాకారయా
అనంత కోట్యండ నాయక శంకర నాయికయా
అష్ట వర్గాత్మక గుప్త-తరయా వరయా
(
మధ్యమ కాల సాహిత్యం)
అనంగాద్యుపాసితయా అష్ట దళాబ్జ స్థితయా
ధనుర్బాణ ధర కరయా దయా సుధా సాగరయా

చరణములోనిఅష్టవర్గాత్మకగుప్తతరయాఅన్న వర్ణనలో ------ అన్న ఎనిమిది వర్గముల ఆద్యక్షరముల చేతను, పంచాశద్వర్ణ రూపిణియైన శ్రీమాత స్తుతింపబడింది. ’అనంగాద్యుపాసితయాఅన్న సంబోధనలో శ్రీమాతను ఉపాసించిన పన్నెండుమంది శ్రీవిద్యా చక్రవర్తులలో ఒకడైన మన్మథుడు కూడా ప్రస్తుతింపబడినాడు.

మనుశ్చంద్రః కుబేరశ్చ లోపాముద్రా మన్మథః! అగిస్త్యరగ్నిసూర్యశ్చ ఇంద్ర స్కంద శివస్తథా! క్రోధభట్టారకో దేవ్యా ద్వాదశామీ ఉపాసకాః!! అని ప్రసిద్ధి.

అంటే మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముర, మన్మథుడు, అగస్త్యుడు, అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు, స్కందుడు, శివుడు, దూర్వాసుడుఅనే పన్నెండుమంది శ్రెవిద్యాచక్రవర్తులు. వారిలో ఒకడైన మన్మథుడు కీర్తనలో ప్రసక్తమైనాడు.

ఇందులోని చక్రస్వామిని, త్రిపురసుందరి. జాగ్రత్ స్వప్న సుషుప్తులను మూడు దశలు, మూడు పురములు, అవస్థా త్రయమునకు అధిష్ఠాత్రి త్రిపురసుందరి.

కీర్తనలోమూకముఖ్యవాక్ప్రదయాఅన్న మాటలలో మూకమహాకవి వంటి వారికి కూడా వాక్శక్తినిచ్చినది జగన్మాతయే అని స్పష్టమవుతున్నది.  మూకకవి శ్రీ శంకర భగవత్పాదులకు సమకాలికుడంటారు. ఆయన మూగవాడు. అందుకు అతనిని మూకకవి అనేవారు. కాంచీపురి లోని కామాక్షీ దేవి అనుగ్రహం వల్ల ఆయనకు మాటలు వచ్చినాయిట. ఆమె ప్రసాదించిన వాక్శక్తితో అతడుమూకపంచశతిఅనే ఒక కావ్యాన్ని వ్రాశాడు. అందులో 500శ్లోకాలలో జగన్మాతను స్తుతించాడు. 500శ్లోకాలు ఐదు శతకాలుగా ఉన్నాయి. అవి ఆర్యాశతకం, పాదారవిందశతకం, స్తుతి శతకం, కటాక్షశతకం, మందస్మిత శతకం అనేవి. జగన్మాత అనుగ్రహం కలిగితే మూగవారు కూడా మహానుభావులవుతారని భావము. “మూకంకరోతి వాచాలం పంఘుం లంఘయతే గిరి! యత్కృపా తమహం వందే” – అని తాత్పర్యం.

4.  కమలాంబికాయై కనకాంశుకాయై - చతుర్థావరన కీర్తన

ముత్తుస్వామి దీక్షితుల వారి నాల్గవ ఆవరణ కీర్తనకమలాంబికాయై కనకాంశుకాయై అన్నది. కాంభోజి రాగంలో, ఆట తాళంలో కూర్పబడింది.

పల్లవి! కమలాంబికాయై కనకాంశుకాయై
కర్పూర వీటికాయై నమస్తే నమస్తే

అనుపల్లవి! కమలా కాంతానుజాయై కామేశ్వర్యై అజాయై
హిమ గిరి తనుజాయై హ్రీంకార పూజ్యాయై
(
మధ్యమ కాల సాహిత్యమ్)
కమలా నగర విహారిణ్యై ఖల సమూహ సంహారిణ్యై
కమనీయ రత్న హారిణ్యై కలి కల్మష పరిహారిణ్యై

చరణము: సకల సౌభాగ్య దాయకాంభోజ చరణాయై
సంక్షోభిణ్యాది శక్తి యుత చతుర్థావరణాయై
ప్రకట చతుర్దశ భువన భరణాయై
ప్రబల గురు గుహ సంప్రదాయాంతఃకరణాయై
అకళంక రూప వర్ణాయై అపర్ణాయై సుపర్ణాయై
సు-కర ధృత చాప బాణాయై శోభన-కర మను కోణాయై
(
మధ్యమ కాల సాహిత్యమ్)
సకుంకుమాది లేపనాయై చరాచరాది కల్పనాయై
చికుర విజిత నీల ఘనాయై చిదానంద పూర్ణ ఘనాయై

శ్రీకమలాంబికకు, కనకాంశుక ధారికి, కర్పూరతాంబూలముఖికి, నారాయణుని సహోదరికి, కామేశ్వరికి, పుట్టుకలేని దానికి, హిమగిరితనయకు, హ్రీంకార పూజ్యకు, దుష్టసంహారికి, కమనీయ రత్న హార ధారిణికి, సర్వసౌభాగ్యదాయినికి, చతుర్దశ భువన ధారిణికి, అపర్ణకు, చాపబాణములు ధరించిన దానికి, చతుర్దశ చక్రము గలదానికి, చరాచర జగత్కర్తకు, నీలిమేఘములను జయించిన ముంగురులు కల శ్రీదేవికి నమస్కారము! – అని కీర్తన అర్థము.

చతుర్థావరణమునకు సంబంధించిన కీర్తనలోని అమ్మవారి విశేషణములన్నీ చతుర్థీవిభక్తిలో ఉన్నాయి. శ్రీచక్రంలోని నాలుగవ ఆవరణము చతుర్దశారము. దీనికి సర్వసౌభాగ్యదాయక చక్రం అని పేరు. ఇది చతుర్దశభువనాత్మకమైనది.

చక్రంలోని పధ్నాలుగు కోణములందును, పధ్నాలుగు దేవతలున్నారు. వారు సర్వసంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాదిని, సర్వసమ్మోహిని, సర్వస్తంభిని, సర్వజృభిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మోదిని, సర్వార్థసాధిని, సర్వసంపత్తి పూరణి, సర్వమంత్రమయి, సర్వద్వంద్వక్షయంకరి, అనేవారు. దేవతలకు సంప్రదాయయోగినులు అని పేరు. చక్రేశ్వరి త్రిపురవాసిని.

విషయాలు కీర్తనలోనిసకలసౌభాగ్యదాయకాంభోజచరణాయై, సర్వసంక్షోభిణ్యాది శక్తియుత చతుర్థావరణాయై, ప్రకట చతుర్దశ భువన్ భరణాయైఅన్న చరణాలలో చెప్పబడింది.

కమలా కాంతానుజఅంటే గౌరీదేవి. దేవీ భాగవత నవమ స్కందంలో సృష్టిక్రమ వర్ణింపబడింది. సృష్టికి పూర్వం మాయాకల్పితములైన మూడు అండములు, నీటిలో పుట్టినాయి. అవి సత్త్వరజస్తమోగుణాత్మకమైనవి. సత్త్వగుణ అండమునుడి విష్ణువు, గౌరి అవతరించారు. అందువల్ల వారిద్దరూ సహోదరులు. రజోగుణ అండమునుండి బ్రహ్మ, లక్ష్మి; తమోగుణ అండమునుండు రుద్రసరస్వతులు అవతరించారు.

ప్రకట చతుర్దశ భువనాభరణాయైఅనుట చేత భూః-భువః-సువః-మహః-జనోతపోసత్యలోకములను సప్త అధోలోకములు కలిసి పధ్నాలుగులోకములు. చతుర్దశ భువనములనూ చతుర్దాశరములోని దేవతలు పాలించుచున్నారని భావము.

హ్రీంకార పూజ్యాయైఅన్న సంబోధన లలితా త్రిశతి నామావళిలోనిది.  హ్రీంకారము-ఏకాక్షర భువనేశ్వరీ మంత్రము. హ్రీంకార మంత్రముచే పూజింపబడే భువనేశ్వరి జగన్మాత అని తాత్పర్యం.

5.  శ్రీకమలాంబికాయాః పరం నహి రే చిత్ - పంచమావరణ కీర్తన

ముత్తుస్వామి దీక్షితుల వారి నవావరణ కీర్తనలలో పంచమావరణ కీర్తనశ్రీకమలాంబికాయాః పరం నహి రే చిత్తఅనేది భైరవి రాగంలో ఝంపె తాళంలో కూర్చబడింది.

పల్లవి: శ్రీ కమలాంబికాయాః పరం నహిరే రే చిత్త
క్షిత్యాది శివాంత తత్వ స్వరూపిణ్యాః
అనుపల్లవి: శ్రీ కంఠ విష్ణు విరించాది జనయిత్ర్యాః
శివాత్మక విశ్వ కర్త్ర్యాః కారయిత్ర్యాః
(మధ్యమ కాల సాహిత్యం)
శ్రీ-కర బహిర్దశార చక్ర స్థిత్యాః
సేవిత భైరవీ భార్గవీ భారత్యాః
చరణం: నాద-మయ సూక్ష్మ రూప సర్వ సిద్ధి -
ప్రదాది దశ శక్త్యారాధిత మూర్తేః
శ్రోత్రాది దశ కరణాత్మక కుళ -
కౌళికాది బహు విధోపాసిత కీర్తేః
అభేద నిత్య శుద్ధ బుద్ధ ముక్త -
సచ్చిదానంద-మయ పరమాద్వైత స్ఫూర్తేః
ఆది మధ్యాంత రహితాప్రమేయ
గురు గుహ మోదిత సర్వార్థ సాధక పూర్తేః
(మధ్యమ కాల సాహిత్యం)
మూలాది నవాధార వ్యావృత్త దశ ధ్వని -
భేదజ్ఞ యోగి బృంద సంరక్షణ్యాః
అనాది మాయావిద్యా కార్య కారణ వినోద -
కరణ పటు-తర కటాక్ష వీక్షణ్యాః

మనసా! పృథివ్యాది షట్త్రింశత్ తత్త్వ స్వరూపిణి, త్రిమూర్తులకు జనయిత్రి, బహిర్దశార చక్రమునధివసించినది, నాదమయ సూక్ష్మరూప సర్వసిద్ధిప్రదాది పదిశక్తులచే ఆరాధింపబడినది. దశేంద్రియ ధర్మములు గల యోగినులచే ఆరాధింపబడినది. సర్వార్థ సాధకమైనది. కటాక్ష వీక్షణములచేతనే కార్యాకారణములను తొలగించగలది అయిన శ్రీదేవి కంటే ఇతరము మరేదీ లేదు అని కీర్తన అర్థము.

పంచమావరణమునకు సంబంధించి కీర్తనలోని అమ్మవారి విశేషణములన్నీ పంచమీ విభక్తిలో ఉన్నాయి.  

శ్రీచక్రంలోని ఐదవ ఆవరణము బహిర్దశారము.  దీనికి సర్వార్థసాధక చక్రం అని పేరు. బహిర్దశారం అనగా వెలుపలగా ఉన్న పది కోణముల చక్రమని అర్థం. చక్రమున పది మంది దేవతలున్నారు. వారుసర్వసిద్ధిప్రద, సర్వసంపత్ప్రద, సర్వప్రియంకరి, సర్వమంగళకరి, సర్వకామప్రద, సర్వదుఃఖవిమోచని, సర్వమృత్యుప్రళయినీ, సర్వవిఘ్ననివారిణి, సర్వాంగ సుందరి, సర్వభాగ్యదాయిని అను వారు. పరదేవతా జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం కలసి పది చక్రమున ఆవరణ దేవతా రూపమున భాసించుచున్నవనిశ్రోత్రాది దశకరణాత్మకకుళకౌళికాది బహు విధోపాసిన కరైఃఅన్న చరణ భావము.

నాదమయ సూక్ష్మరూప సర్వసిద్ధిప్రదాది దశ శక్త్యారాధిత మూర్తేఃఅన్న చరణములో సహజా మనస్క యోగము చెప్పబడింది. చిణి, చిణిచిణి, ఘంటానాద, శంఖనాద, వీణానాద, మృదంగనాద, మేఘనాదములు అనే దశ విధ నాదములను యోగులు పరనాదములో లయింపజేస్తారు. ఆవిధంగా పరాశక్తి అనుగ్రహానికి పాత్రులు అవుతారు. అందుకేనాదరూపిణీఅని లలితాసహస్రనామంలో వర్ణింపబడింది.

ప్రాణ-అపాన-వ్యాన-ఉదాన-సమాన అని అయిదు ప్రాణములను నాద, కూర్మ, క్రుకర, దేవదత్త, ధనంజయ అనే అయిదు ఉప ప్రాణములను ఆవరణ దేవతలుగా ఉన్నారని భావనోపనిషత్తులో చెప్పబడింది. కీర్తనలోని చరణములలో అప్రమేయా, కార్యకారణనిర్ముక్తా, అన్న లలితాసహస్రనామావాళిలోని నామములు నిబద్ధింపబడినాయి.

6.  కమలాంబికాయాస్తవ భక్తోహం - షష్ఠావరణ కీర్తన

ముత్తుస్వామి దీక్షితుల వారి షష్ఠావరణ కీర్తనకమలాంబికాయాః తవ భక్తోహంఅన్నది. పున్నాగవరాళి రాగము, రూపకతాళములో ఉన్నది.

పల్లవి: కమలాంబికాయాస్తవ భక్తోహం
శంకర్యాః శ్రీ-కర్యాః సంగీత రసికాయాః శ్రీ
అనుపల్లవి: సుమ శరేక్షు కోదండ పాశాంకుశ పాణ్యాః
అతి మధుర-తర వాణ్యాః శర్వాణ్యాః కల్యాణ్యాః
(మధ్యమ కాల సాహిత్యమ్)
రమణీయ పున్నాగ వరాళి విజిత వేణ్యాః శ్రీ
చరణమ్: దశ కలాత్మక వహ్ని స్వరూప -
ప్రకాశాంతర్దశార సర్వ రక్షా-కర చక్రేశ్వర్యాః
త్రి-దశాది నుత క--వర్గ-ద్వయ-మయ సర్వజ్ఞాది -
దశ శక్తి సమేత మాలినీ చక్రేశ్వర్యాః
త్రి-దశ వింశద్వర్ణ గర్భిణీ కుండలిన్యాః
దశ ముద్రా సమారాధిత కౌళిన్యాః
(మధ్యమ కాల సాహిత్యమ్)
దశ రథాది నుత గురు గుహ జనక శివ బోధిన్యాః
దశ కరణ వృత్తి మరీచి నిగర్భ యోగిన్యాః శ్రీ

శంకరి, శ్రీకరి, సంగీతరసిక, పాశాంకుశకోదండపుష్పబాణములను ధరించినది, మధుర వాక్కులు కలది, శర్వాణి, కళ్యాణి, పున్నాగవరాళిని జయించిన వేణిగలది. దశకళాత్మికయైన సమన్విత త్రిపురమాలిని అయిన చక్రేశ్వరి, దశముద్రా సమారాధిత కౌళిని, గర్భయోగినులనే దేవతాస్వరూపిణి అయిన కమలాంబిక భక్తుడనుఅని కీర్తన అర్థము.

షష్ఠావరణమునకు సంబంధించిన కీర్తనలోని అమ్మవారి విశేషణములన్నీ షష్ఠీవిభక్తిలోనే ఉన్నాయి.

శ్రీచక్రములోని షష్ఠావరణము అంతర్దశారము. దీనికి సర్వరక్షాకర చక్రము అని పేరు. ఇక్కడ పదిమంది దేవతలున్నారు. వారుసర్వజ్ఞా, సర్వశక్తిమయి, సర్వైశ్వర్యప్రద, సర్వరక్షాస్వరూప, సర్వేప్సితఫలప్రద అనేవారు.

దేవతలు గర్భయోగినులు. చక్రేశ్వరి త్రిపురమాలిని. విషయములుదశశక్తిసమేత మాలినీ చక్రేశ్వర్యాః, దశకరణావృత్తి మరీచిని గర్భయోగిన్యాఅన్న చరణములలో చెప్పబడింది.

కచవర్గాద్వయ; అనటం వలన ఇక్కడి మాతృకావర్ణముల్ కఖగఘఙచఛజఝఞ అన్నవి.

సుమశరేక్షు కోదండ పాశాంకుశ పాణ్యాఃఅన్న చరణంలో అమ్మవారు పుష్పబాణాలను, చెరకువిల్లును, పాశమును, అంకుశమును, ధరించినట్లు వర్ణింపబడింది.

కమలము, తెల్లకలువ, నల్లకలువ, ఎర్రకలువ, మామిడిపువ్వుఅనే 5పువ్వులూ అమ్మవారి పంచబాణములని ప్రసిద్ధి. ఐదు బాణములతో మదన, ఉన్మాదన, మోహన, దీపన, శోషణములనే అవస్థల పాలు చేస్తుంది జీవులను జగన్మాత.

దశముద్రా సమారాధిత కౌళిన్యాఃఅనడం వలన సర్వ సంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశ, సర్వఖేచరి, సర్వబీజ, సర్వయోని, సర్వత్రిఖండఅనే పది ముద్రల చేతను ఆరాధింపబడే పరాశక్తి ఆమె అని చెప్పబడింది.

అంతర్దశార తత్త్వము అగ్నితత్త్వము. ఇక్కడ ఉన్న పదిమంది దేవతలు అగ్నియొక్క పది కళలతోను ప్రకాశిస్తున్నారనివళకళాత్మిక వహ్ని స్వరూప ప్రకాశ అంతర్దశార సర్వరక్షాకర చక్రేశ్వరిఅన్న చరణములోని భావము. ధూమ్రా, ఊష్మా, జ్వలినీ, జ్వాలినీ, విస్ఫులింగినీ, సుశ్రీ, సురూపా, కపిలా, హవ్యవాహిని, కవ్యవాహిని అన్న పదీ అగ్నియొక్క కళలు. పది కళలను ధరించిన వారు ఆవరణ దేవతలు.

శాంకరీ, శ్రీకరీ, శర్వాణీ, కళ్యాణీ, సర్వజ్ఞా, దశముద్రా సమారాధ్యా, కౌళినీ, శివజ్ఞానప్రదాయినీ అన్న లలితాసహస్రనామావళిలోని నామములు కీర్తనలో నిబద్ధింపబడినాయి.

మరొక విశేషము – ‘పున్నాగవరాళి విజితవేణ్యాఅని ఇందులో జగన్మాత వర్ణింపబడింది. అంటే నల్లని మగ తుమ్మెదల సమూహాన్ని జయించిన నీలవేణి కలది తల్లి అర్థము. కీర్తన పున్నాగవరాళి రాగములో కూర్చబడడం వలన పున్నాగవరాళి విజతవేణాఅన్న విశేషణం సార్థకమయినది.

7.  శ్రీ కమలాంబికాయాం భక్తిం కరోమి - సప్తమావరణ కీర్తన

ముత్తుస్వామి దీక్షితుల వారి నవావరణ కీర్తనలలో సప్తమావరణ కీర్తనశ్రీ కమలాంబికాయాం భక్తిం కరోమిఅన్నది. శహనా రాగము, త్రిపుట తాళములో కూర్చబడినది.

పల్లవి: శ్రీ కమలాంబికాయాం భక్తిం కరోమి
శ్రిత కల్ప వాటికాయాం చండికాయాం జగదంబికాయాం
అనుపల్లవి: రాకా చంద్ర వదనాయాం రాజీవ నయనాయాం
పాకారి నుత చరణాయాం ఆకాశాది కిరణాయాం
(మధ్యమ కాల సాహిత్యం)
హ్రీంకార విపిన హరిణ్యాం హ్రీంకార సు-శరీరిణ్యాం
హ్రీంకార తరు మంజర్యాం హ్రీంకారేశ్వర్యాం గౌర్యాం
చరణం: శరీర త్రయ విలక్షణ సుఖ-తర స్వాత్మానుభోగిన్యాం
విరించి హరీశాన హరి-హయ వేదిత రహస్య యోగిన్యాం
పరాది వాగ్దేవతా రూప వశిన్యాది విభాగిన్యాం
చరాత్మక సర్వ రోగ హర నిరామయ రాజ యోగిన్యాం
(మధ్యమ కాల సాహిత్యం)
కర ధృత వీణా వాదిన్యాం కమలా నగర వినోదిన్యాం
సుర నర ముని జన మోదిన్యాం గురు గుహ వర ప్రసాదిన్యాం

ఆశ్రితకల్పలతిక, చండిక, జగదాంబిక, రాకాచంద్రవదన, రాజీవ నయన, ఇంద్రాదినుత చరణ, హ్రీంకార బీజనిలయ, గౌరి, శరరీత్రయాతీత, త్రిమూర్తి విదిత, వశిన్యాది వాగ్దేవతారూపిణి, సర్వరోగహరరాజయోగిని, అయిన కమలాంబికయందు నేను భక్తిప్రపత్తులతో ఉన్నాను అని అర్థము.

శ్రీచక్రంలోని సప్తమావరణము అష్టకోణ చక్రము. దీనికి సర్వరోగహర చక్రము అని పేరు. చక్రములోని ఎనిమిది కోణాలను ఎనిమిదిమంది దేవతలు ఆశ్రయించి ఉన్నారు. వారు వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, కౌళిని, సర్వేశ్వరి అనేవారు. వీరే వశిన్యాది వాగ్దేవతలు.

అమ్మవారి ఆజ్ఞానుసారం ఆమెను సహస్రనామములతో కీర్తించిన వారు వశిన్యాది వాగ్దేవతలే. వీరు రహస్యయోగినులు. చక్రేశ్వరి,  త్రిపురాసిద్ధ.

విషయములురహస్య యోగిన్యాం పరాదివాగ్దేవతారూప వశిన్యాది విభాగిన్యాం, చరాత్మక సర్వరోగహర నిరామయ రాజయోగిన్యాంఅన్న చరణములలో చెప్పబడింది.

కీర్తన పల్లవిలోహ్రీంకారారణ్యహరిణి, హ్రీంసుశరీరిణి, హ్రీంకార తరుమంజరి, హ్రీంకార మూర్తి, అన్న లలితా త్రిశతీ నామ స్తోత్రములోని నామములు వర్ణింపబడినాయి. అట్లాగేఆశ్రిత కల్పలతిక, చండిక, గౌరి వంటి సహస్ర నామావళిలోని నామములు కూడా నిబద్ధింపబడినాయి.

8.  శ్రీ కమలాంబికే అవావ శివే కర ధృత శుక శారికే - అష్టమావరణ కీర్తన

ముత్తుస్వామి దీక్షితుల వారి నవావరణ కీర్తనలలోని అష్టమావరణ కీర్తనశ్రీ కమలాంబికే అవావ
శివే కర ధృత శుక శారికేఅన్నది. ఘంటారాగం, ఆదితాళంలో కూర్చబడినది.

పల్లవి: శ్రీ కమలాంబికే అవావ
శివే కర ధృత శుక శారికే
అనుపల్లవి: లోక పాలిని కపాలిని శూలిని
లోక జనని భగ మాలిని సకృద్-
(మధ్యమ కాల సాహిత్యం)
ఆలోకయ మాం సర్వ సిద్ధి-ప్రదాయికే
త్రిపురాంబికే బాలాంబికే
చరణం: సంతప్త హేమ సన్నిభ దేహే
సదాఖండైక రస ప్రవాహే
సంతాప హర త్రికోణ గేహే
సకామేశ్వరి శక్తి సమూహే
సంతతం ముక్తి ఘంటా మణి -
ఘోషాయమాన కవాట ద్వారే
అనంత గురు గుహ విదితే
కరాంగులి నఖోదయ విష్ణు దశావతారే
(మధ్యమ కాల సాహిత్యం)
అంతఃకరణేక్షు కార్ముక శబ్దాది -
పంచ తన్మాత్ర విశిఖాత్యంత -
రాగ పాశ ద్వేషాంకుశ ధర -
కరేతి రహస్య యోగినీ పరే

శ్రీకమలాంబిక! లోకపాలిని, శూలిని, లోకజనని, భగమాలిని, సర్వసిద్ధిప్రద, త్రిపురాంబిక, త్రికోణచక్రస్థిత, కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతి, అంతఃకరణ కార్ముకమును, పంచతన్మాత్ర బాణములను ధరించిన దానా, రాగపాశ, క్రోధాంకుశధరీ, అతిరహస్య యోగినీ, నన్ను కటాక్షింపుము అని కీర్తన భావము.

అష్టమావరణమునకు సంబంధించిన కీర్తనలోని అమ్మవారి విశేషణాలన్నీ సంబోధనా ప్రథమావిభక్తిలో ఉన్నాయి. శ్రీచక్రంలోని అష్టమావరణము, త్రికోణచక్రము. దీనికి సర్వసిద్ధిప్రద చక్రమని పేరు. ఇక్కడ ముగ్గురు దేవతలు ఉన్నారు. వారు మహాకామేశ్వరి, మహా వజ్రేశ్వరి, మహా భగమాలిని అన్నవారు. ముగ్గురు దేవతలనూ సర్వసిద్ధిప్రద చక్రంలోని మూడు జంటలుగా భాసిస్తున్నారు. ఉత్తరకోణస్థ బిందువు జాలంధర పీఠము - ఇక్కడనున్న మహాకామేశ్వరి, ఉమామహేశ్వరుల రూపము.  దక్షిణకోణస్థ బిందువు పూర్ణగిరి పీఠముఇక్కడ ఉన్న మహావజ్రేశ్వరి లక్ష్మీనారాయణుల రూపము. మూడవ కోణస్థ బిందువు కామగిరి పీఠముఇక్కడ ఉన్న మహాభగమాలిని వాణీహిరణ్యగర్భుల రూపము. అంతేకాక బాలామంత్రంలోని మూడు బీజములను అష్టమావరణ త్రికోణమున ఉన్నవి. అందువలన త్రికోణము సాక్షాత్తు బాలాంబా రూపమే. అందుకే ఇక్కడ చక్రస్వామినిత్రిపురాంబ’.

కీర్తన చరణములోకరాంగుళినఖోదయ విష్ణుదశావతారేఅని అమ్మవారు అభివర్ణింపబడింది. జగన్మాతయొక్క కుడి ఎడమచేతుల పది వ్రేళ్ళ గోళ్ళ సందుల నుండి పుట్టిన నారాయణ దశావతారములు కలది అని అర్థము. దీని వివరణ లలితోపాఖ్యానంలో ఉన్నది. భండాసురుని సంహరించడానికి జగన్మాత చక్రరాజమహారథంపైన బయలుదేరింది. ‘చక్రరాజమహాయంత్రమధ్యవర్తిన్యై నమః’. నాలుగు వేదములు రథానికి చక్రాలు కాగా ధర్మార్థకామమోక్షములు గుర్రాలైనాయి. తొమ్మిది పర్వములున్న చక్రరాజ రథముపైన సిద్ధ, దివ్య, మానవౌఘ, ముద్రాదేవతలు, అష్టమాతృకలు, వశిన్యాది వాగ్దేవతలు, ప్రకట, గుప్త, గుప్తతర, సంప్రదాయ, కులోత్తీర్ణ, గర్భ, రహస్య, అతిరహస్య, యోగినులు అధివసించగా చతుష్షష్టికోటి యోగినులతో జగన్మాత భండాసురునితో యుద్ధానికి స్వయంగా బయలుదేరింది. భండాసురుడు జగన్మాతతో యుద్ధం చేయలేక మహాసురాస్త్రాన్ని ప్రయోగించాడు. అందులోనుండి మహిషాసురుడు, మధుకైటభులు, ధూమ్రలోచనుడు, చండముండులు, శుంభనిశుంభులు, రక్తబీజాదులు ఇంకా వేలాదిమంది మహాకాయులు ఉద్భవించారు. వారందరినీ శ్రీదేవి దుర్గాదేవియై సంహరించింది.

తరువాత భండాసురుడు సర్వాసురాస్త్రాన్ని ప్రయోగించాడు. అందులోనుంచి సోమకుడు రావణుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు మొదలైన రాక్షసులు పుట్టి యుద్ధం చేయసాగారు. అప్పుడు శ్రీదేవి కుడిఎడమ చేతుల వ్రేళ్ళ గోళ్ళనుంచి మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, కృష్ణ, కల్కి రూపములైన నారాయణుని దశావతారములు పుట్టి రాక్షసులందరినీ సంహరించాయి అని బ్రహ్మాండపురాణంలో చెప్పబడింది.

ఇదే విషయము శ్రీలలితాసహస్రనామాలలోనికరాంగుళినఖోత్పన్ననారాయణదశాకృతిఃఅన్న నామములో చెప్పబడింది. కీర్తనలోశూలాధ్యాయుధ సంపన్నా, శివా, భగమాలినీ, త్రిపురాంబా, బాలా, త్రికోణగా, మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయకా, అన్న సహస్రనామావళిలో నామములు నిబద్ధింపబడినాయి.

9.  శ్రీ కమలాంబా జయతి అంబా - నవమావరణ కీర్తన

ముత్తుస్వామి దీక్షితుల వారి నవావరణ కీర్తనలలోని నవమావరణ కీర్తనశ్రీ కమలాంబా జయతి అంబాఅన్నది ఆహిరి రాగము, రూపక తాళంలో ఉన్నది.

పల్లవి: శ్రీ కమలాంబా జయతి అంబా
శ్రీ కమలాంబా జయతి జగదంబా
శ్రీ కమలాంబా జయతి
శృంగార రస కదంబా మదంబా
శ్రీ కమలాంబా జయతి
చిద్బింబ ప్రతి-బింబేందు బింబా
శ్రీ కమలాంబా జయతి
(మధ్యమ కాల సాహిత్యం)
శ్రీ పుర బిందు మధ్యస్థ చింతామణి మందిరస్థ -
శివాకార మంచ స్థిత శివ కామేశాంకస్థా

అనుపల్లవి: సూకరాననాద్యర్చిత మహా త్రిపుర సుందరీం
రాజ రాజేశ్వరీం శ్రీ-కర సర్వానంద-మయ -
చక్ర వాసినీం సువాసినీం చింతయేహం
(మధ్యమ కాల సాహిత్యం)
దివాకర శీత కిరణ పావకాది వికాస-కరయా
భీ-కర తాప-త్రయాది భేదన ధురీణ-తరయా
పాక రిపు ప్రముఖాది ప్రార్థిత సు-కళేబరయా
ప్రాకట్య పరా-పరయా పాలితో-దయా-కరయా

చరణం: శ్రీ మాత్రే నమస్తే చిన్మాత్రే
సేవిత రమా హరీశ విధాత్రే
వామాది శక్తి పూజిత పర దేవతాయాః సకలం జాతం
కామాది ద్వాదశభిరుపాసిత -
కాది హాది సాది మంత్ర రూపిణ్యాః
ప్రేమాస్పద శివ గురు గుహ జనన్యాం -
ప్రీతి యుక్త మచ్చిత్తం విలయతు
(మధ్యమ కాల సాహిత్యం)
బ్రహ్మ-మయ ప్రకాశినీ నామ రూప విమర్శినీ
కామ కలా ప్రదర్శినీ సామరస్య నిదర్శినీ!!

శ్రీచక్రంలోని తొమ్మిదవ ఆవరణమునకు సంబంధించిన కీర్తన సార్వవిభక్తికము అంటే ఇందులో ఎనిమిది విభక్తులూ ఉంటాయి. సంస్కృతాంధ్ర కావ్యాలలో ఉదాహరణ కావ్యములని ఉన్నాయి. వీటిలో సప్తవిభక్తులలో శృతి చేసిన తర్వాత, ఒకే పద్యములో అన్ని విభక్తులలోనూ, స్తుతించడం సంప్రదాయం. దానినిసార్వవిభక్తికముఅంటారు. కీర్తన కూడా అలాంటి సార్వవిభక్తికమే.

. శ్రీమాత, జగదంబ, శృంగార రసకదంబ, శ్రీచక్రబిందుస్థ, చింతామణిమందిరస్థ, శివాకార మందిరస్థ, అయిననాతల్లి జయించుగాక! అన్నది ప్రథమావిభక్తి. . వారాహీ మొదలగు శక్తులచే అర్చించబడిన మహాత్రిపురసుందరిని, రాజేశ్వరిని, సువాసినిని, సర్వానందమయ చక్రవాసినిని, ఎప్పుడూ ధ్యానిస్తూ ఉంటాను అన్నది ద్వితీయా విభక్తి. . సూర్యచంద్రాగ్నులకు ప్రకాశము కలిగించే శక్తిచేతను, తాపత్రయములను పోగొట్టే తల్లిచేతను, ఇంద్రాది దేవతావిందితచేతను, పరాపరరహస్య యోగిని చేతను, దయామయిచేతను రక్షింపబడుచున్నాను అన్నది తృతీయా విభక్తి. . శ్రీమాతకు, త్రిమూర్తులచేత సేవింపబడిన తల్లికి, నమస్కారము అన్నది చతుర్థీవిభక్తి. . వామాది శక్తులచేత పూజింపబడిన తల్లివల్లనే సమస్తమూ పుట్టినాయి అన్నది పంచమీ విభక్తి.. మన్మథాది ద్వాదశ శ్రీవిద్యా చక్రవర్తుల చేతను ఉపాసింపబడిన వాది, హాది, సాది మంత్ర విద్యలయొక్క రూపి అయినది శ్రీమాత! అన్నది షష్ఠీవిభక్తి. . ప్రేమాస్పదయైన గురుగుహుని తల్లియందు నా మనస్సు లయమందును గాక అన్నది సప్తమీవిభక్తి. . బ్రహ్మమయ ప్రకాశినీ! నామరూప విమర్శినీ! కామకళాప్రదర్శినీ సామరస్య నిదర్శనీ! నన్ను అనుగ్రహించుఅన్నది సంబోధన ప్రథమా విభక్తి.

శ్రీచక్రములోని నవమావరణము బింద్వాకృతి కలది. దీనికి సర్వానందమయ చక్రమని పేరు. ఇది పంచబ్రహ్మాత్మికమైనది. చక్రేశ్వరి సాక్షాత్తు శ్రీత్రిపురసుందరీదేవి. శ్రీలలితా సహస్రనామావళిలోనిపంచబ్రహ్మాసనస్థితాఅన్న నామార్థమిదే. కీర్తనయొక్క పల్లవిలోనిశ్రీపురబింధు మధ్యస్థ, చింతామణి మందిరస్థ, శివాకారమంచస్థిత, శివకామేశాంకస్థాఅన్న వర్ణన శ్రీశంకరభగవత్పాదుల సౌందర్యలహరిలోని

సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే  
మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే
శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం
భజన్తిత్వాం ధన్యాహ కతిచన చిదానందలహరీం!!08!! అన్న శ్లోక తాత్పర్యమే.

ఈ కీర్తనలో అంబా, జగదంబా, శృంగారరస సంపూర్ణా, బింధుమండల మధ్యస్థా, చింతామణిగృహాంతస్థా, శివకామేశ్వరాంకస్థా, మహాత్రిపురసుందరీ, రాజరాజేశ్వరీ, సువాసినీ, సామరస్యపరాయణా, శ్రీమాతఅన్న సహస్రనామావళిలోని నామములు నిబద్ధింపబడినాయి.

ముత్తుస్వామి దీక్షితుల వారు ఈవిధంగా సర్వవిభక్తులలోను అమ్మవారిని కీర్తిస్తూ ఈ నవావరణ కీర్తనలను వ్రాశారు. వీటిలో శ్రీలలితా సహస్ర నామావళిలోని నామములు, త్రిశతీ స్తోత్రములోని నామములు, ఖడ్గమాలలోని రహస్యములు, బ్రహ్మాండపురాణ, దేవీభాగవతాదులలోని విశేషములు ఎన్నో నిక్షేపింపబడినాయి. శ్రీచక్రములోని తొమ్మిది ఆవరణముల తత్త్వాన్ని నిక్షేపించి వ్యాఖ్యానించారు దీక్షితుల వారు. ఈ కీర్తనలను అమ్మవారు ఎదుట నిలిచి పాడుతూ ఉన్నట్లుగా ఉన్నాయి కానీ నిలకడగా కూర్చొని వ్రాసినట్లు కన్పించవు. అయినప్పటికీ కుమారస్వామి అనుగ్రహం వల్ల ఆ కీర్తనలలో మునుపు చెప్పిన విషయాలు ఎన్నో చోటుచేసుకున్నాయి. ఇవి దీక్షితుల వారి భక్తితత్పరతకు, ఆ జగన్మాత ఆయనపట్ల చూపిన కారుణ్యదృష్టికి నిదర్శనములు.

శ్రీకమలాంబికే శివే పాహిమాం - మంగళ కీర్తన

ఇంక చిట్టచివర కీర్తనశ్రీకమలాంబికే శివే పాహిమాంఅన్న మంగళ కీర్తన. శ్రీరాగం, ఖండజాతి ఏకతాళములో ఉన్నది.

పల్లవి: శ్రీ కమలాంబికే శివే పాహి మాం లలితే
శ్రీ-పతి వినుతే సితాసితే శివ సహితే
సమష్టి చరణం
రాకా చంద్ర ముఖీ రక్షిత కోల ముఖీ
రమా వాణీ సఖీ రాజ యోగ సుఖీ
(మధ్యమ కాల సాహిత్యం)
శాకంభరి శాతోదరి చంద్ర కలా ధరి
శంకరి శంకర గురు గుహ భక్త వశంకరి
ఏకాక్షరి భువనేశ్వరి ఈశ ప్రియ-కరి
శ్రీ-కరి సుఖ-కరి శ్రీ మహా త్రిపుర సుందరి

శ్రెకమలాంబికా! శివా! లలితా! శ్రీపతివినుతా! శివసహితా! రాకాచంద్రముఖీ! శాకంభరీ! శాతోదరీ! చంద్రకళాధరీ! శంకరీ! ఏకాక్షరీ! భువనేశ్వరీ! ఈశ్వప్రియా! శ్రీకరీ! సుఖకరీ! శ్రీమహాత్రిపురసుందరీ! పాహిమాం! శివే పాహిమాం! అని ఈ కీర్తన అర్థము.

నవావరణ కీర్తనలకు ముందున్న ధ్యానకీర్తనలాగానే ఈ మంగళకీర్తన కూడా ఆ జగన్మాత మహిమను తెలిపేది. శ్రీలలిత, రాజరాజేశ్వరి, కామేశ్వరి, భువనేశ్వరి, శాకంభరి, మహాత్రిపురసుందరీ! అన్నీ ఆ జగన్మాతయే.

ఇందులో లలితా, శ్రీకంఠార్థశరీరిణీ, రాకేందువదనా, శాకంభరీ, శాతోదరీ, శాంకరీ, శ్రీకరీ, సుఖకరీ, శ్రీమత్ త్రిపురసుందరీ, అనే లలితా సహస్రనామావళిలోని నామములు నిబద్ధింపబడినాయి.

ఈవిధంగా ముత్తుస్వామి దెక్షితుల వారు ఈ నవావరణ కీర్తనలలో జగన్మాత అయిన శ్రీదేవిని తనివితీరా ప్రస్తుతించారు. ఆ అమ్మవారి దివ్య స్వరూపాన్ని మనకు దర్శింపజేసి ఆమె కారుణ్యాన్ని మనపై వర్షింపజేశారు. శ్రీశంకరులు చెప్పినట్లుతనోతు క్షేమం నః తవ వదనసౌందర్యలహరీ! – అమ్మా! జగన్మాతా! నీ ముఖ సౌందర్య ప్రవాహము మా అందరికీ సుఖసంతోషములనిచ్చి రక్షించుగాక!

యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా! నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః!!

 

 

 

 

 

 

 

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ